కాంగ్రెస్‌లో ప‌నిచేసిన వారికి టికెట్లు ఇంటికి నడుచుకుంటూ వస్తాయ్‌

Revanth Reddy Meet Balmoor Venkat In Hospital. విద్యార్థుల అత్మబలిదానంతో వచ్చిన తెలంగాణలో విద్యార్థులపై దాడులు చేయడం సిగ్గుచేటని

By Medi Samrat  Published on  3 Oct 2021 8:29 AM GMT
కాంగ్రెస్‌లో ప‌నిచేసిన వారికి టికెట్లు ఇంటికి నడుచుకుంటూ వస్తాయ్‌

విద్యార్థుల అత్మబలిదానంతో వచ్చిన తెలంగాణలో విద్యార్థులపై దాడులు చేయడం సిగ్గుచేటని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులపై దాడులు చేయించి కేసీఆర్‌ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని.. కేసీఆర్ ను గద్దె దించడం ఖాయమ‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. విద్యార్థి నిరుద్యోగ సైరన్ లో పోలీసుల లాఠీఛార్జ్ లో గాయాలపాలై.. నాగోల్ సుప్రజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎన్ఎస్‌యూఐ అధ్య‌క్షుడు బల్మురి వెంకట్‌తో పాటు మరికొందరిని రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని.. అమరవీరులను, విద్యార్థి, నిరుద్యోగులను ద్వేషిస్తూ, దూషిస్తూ దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిప‌డ్డారు.

కేవలం వారి కుటుంబంలో మాత్రమే పదవులు పొంది విద్యార్థులపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివ‌ర్ణించారు. విద్యార్థులపై దాడులు చేసిన అధికారులపై ఎస్సీ , ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు, యువతకు టికెట్లు ఇంటికి నడుచుకుంటూ వస్తాయని అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ను ప్రకటించామ‌ని పేర్కోన్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్య‌క్ర‌మంలో దామోదర్ రాజ నరసింహ, షబ్బీర్ అలీ, మల్లు రవి, మల్రెడ్డి రంగారెడ్డి, మల్ రెడ్డి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story