కేసీఆర్ అవినీతిని నిరూపించకుంటే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా..

Revanth Reddy Fires On CM KCR. కేసీఆర్, బండి సంజయ్ ల ప్రెస్ మీట్ లు చిక్కడపల్లి కల్లు కాంపౌండ్ ను తలపిస్తున్నాయని

By Medi Samrat  Published on  10 Nov 2021 10:08 AM GMT
కేసీఆర్ అవినీతిని నిరూపించకుంటే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా..

కేసీఆర్, బండి సంజయ్ ల ప్రెస్ మీట్ లు చిక్కడపల్లి కల్లు కాంపౌండ్ ను తలపిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కొంప‌ల్లిలో రెండ‌వ రోజు జ‌రుగుతున్న కార్య‌క‌ర్త‌ల‌ శిక్షణా తరగతుల కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ.. భవిష్యత్ లో ఇంకా చాలా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సోనియా గాంధీ ఆమోదిస్తే వచ్చే సంవత్సరం ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తామ‌ని అన్నారు. కేసీఆర్, బండి సంజయ్ ల ప్రెస్ మీట్ లు చిక్కడపల్లి కల్లు కాంపౌండ్ ను తలపిస్తున్నాయని.. బండి సంజయ్ ను కేసీఆర్ 6 ముక్కలు చేస్తా అన్నా.. అరవింద్, బండి సంజయ్ లు ఎంధుకు నోరు విప్పడం లేదని ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ పార్టీ చర్చలో లేకుండా ఉండేందుకు బీజేపీ, టీఆర్ఎస్ లు పోలిటికల్ డ్రామా ఆడుతున్నాయని అన్నారు. కేసీఆర్ అవినీతిని బయటపెట్టే ధైర్యం మాకు ఉంది.. అమిత్ షా అపాయింట్ మెంట్ బండి సంజయ్ ఇప్పిస్తాడా అని స‌వాల్ విసిరారు. నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్ కోట్ల అవినీతి కి పాల్పడ్డాడని.. మోదీ ,అమిత్ షా లకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. మీరు సీబీఐ ఎంక్వరీ వేయండి.. కేసీఆర్ అవినీతిని నేను నిరూపించకుంటే.. రాజకీయాల శాశ్వతంగా నుంచి తప్పుకుంటాన‌ని రేవంత్ అన్నారు.

కేసీఆర్ ఇచ్చిన డబ్బులను తమిళనాడు ఎన్నికలకు కిషన్ రెడ్డి తరలించాడని ఆరోపించారు. తమిళనాడులో బీజేపీ ఎన్నికల ఖర్చు అంతా కేసీఆర్ పెట్టుకున్నాడని ఆరోపించాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ని మరోసారి చేసేందుకు కేసీఆర్ మోడీ తో ఒప్పందం చేసుకున్నారని అన్నారు. అక్కడఎంఐఎం చేత వంద సీట్లకు పోటీ చేయించి.. ప్రతిపక్ష ఓట్లను చీల్చి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. పవర్ ప్రాజెక్టులలో కేసీఆర్ వెయ్యి కోట్ల అవినీతి కి పాల్పడ్డాడ‌ని ఆరోపించారు. గచ్చిబౌలి, నార్సింగి లలో వేల కోట్ల రూపాయల భూములను పప్పు, బెల్లంలా కేసీఆర్ తన మనుషులకు కట్టబెట్టాడని విమ‌ర్శించారు.

పవర్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించినప్పుడు.. నేను ఆధారాలు ఇస్తా అని చెప్పినాన‌ని.. ఇప్పుడు బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్ర‌శ్నించారు. మంత్రులు ఇసుక మాఫియా చేస్తున్నారని.. నక్లెస్ రోడ్ లో సంజీవయ్య పార్క్ ను మంత్రి తలసాని ఆక్రమించార‌ని.. విచారణకు ఆదేశించే ధైర్యం బీజేపీకి ఉందా అని స‌వాల్ విసిరారు. అమరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో అధికారం చెలాయిస్తున్న కేసీఆర్.. ఏనాడైనా అమరుల కుటుంబాలను పట్టించుకున్నారా..? అని ప్ర‌శ్నించారు. ట్యాంక్ బండ్ పై నిర్మిస్తున్న అమరవీరుల స్థూపంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు.


Next Story