స్టేషన్ ఘనపూర్ లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందే

Revanth Reddy Fire On CM Kadiyam Srihari And Rajaiah. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర స్టేషన్ ఘన్‌పూర్ చేరుకుంది.

By Medi Samrat  Published on  17 Feb 2023 2:45 PM GMT
స్టేషన్ ఘనపూర్ లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందే

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర స్టేషన్ ఘన్‌పూర్ చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పుట్టిన గడ్డ ఇది. సర్దార్ సర్వాయి పాపన్న ఏలిన గడ్డ ఇది అని అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేన‌ని పేర్కొన్నారు. లెక్చరర్ గా పనిచేసి విద్య విలువ తెలిసిన కడియం శ్రీహరి.. స్టేషన్ ఘనపూర్ కు డిగ్రీ కాలేజీ తేలేకపోయారని విమ‌ర్శించారు. గతంలో కడియం కొంచెం పరువుగా బతికారు. దొరగడీలో చేరాక చచ్చిన పాము కంటే హీనంగా బానిసగా బతుకుతున్నారని.. రాజయ్య పంచెకట్టు కాంగ్రెస్ లో చెల్లింది కానీ.. దొర గడీలో చెల్లలేదని ఇరువురు బీఆర్ఎస్ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఉపముఖ్యమంత్రిగా రాజయ్య బర్తరఫ్ తెలంగాణ చరిత్రలో ఒక మాయని మచ్చ అని పేర్కొన్నారు. దళితులంటే చిన్నచూపు ఉన్న కేసీఆర్.. అవినీతి ఆరోపణల పేరుతో ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. రాజయ్య నిజంగా అవినీతి చేసి ఉంటే ఎందుకు బయటపెట్టలేదు? అని ప్ర‌శ్నించారు. రాజయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్. గాడిదకంటే హీనంగా దొరగారి దొడ్లో ఆయనకు అవమానం జరిగిందని అన్నారు. గతంలో వరంగల్ కు వైద్య విధాన పరిషత్ తెస్తా అని ప్రకటించిన రాజయ్య.. సొంత నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి తేలేకపోయాడని విమ‌ర్శించారు.

కడియం తో పోలిస్తే కోవర్టు దయాకరరావుకు ఓనమాలు కూడా రావు అని విమ‌ర్శించారు. ఒకప్పుడు ఆత్మగౌరవంతో బతికిన కడియం శ్రీహరికి ఇంత అవమానం అవసరమా? మాదిగబిడ్డల పౌరుషం కడియంలో చచ్చిపోయిందా? పదవుల కోసం తాకట్టు పెట్టారా? అని ప్ర‌శ్నించారు. ఒక్క మాదిగ సోదరుడిని కూడా కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోలేదని.. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా? అని నిల‌దీశారు. ఉద్యమంలో ఉన్నప్పుడు రబ్బరు చెప్పులు లేనివాళ్లు ఇవాళ వేల కోట్లకు పడగలెత్తారు.. దొరల గడీలు బద్దలు కొట్టాల్సిన రోజులు మళ్లీ వచ్చాయని అన్నారు.

ఎంఏ బీఈడీ చేసిన ఆడబిడ్డ చెప్పులు అమ్ముకునే దుర్భర పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నోటిఫికేషన్లు లేక ఉద్యోగం రాక నిరుద్యోగుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు సాయం అందిస్తాం. రైతన్నలకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రుల్లో చికిత్సకు రూ.5లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. రైతులకు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించే బాధ్యత మాది. కాంగ్రెస్ గెలిస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని రేవంత్ హామీల వ‌ర్షం కురిపించారు.


Next Story