బీజేపీకి రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతున్నా: రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం నాడు బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో పార్టీ పరిస్థితిని ఆయన పేర్కొన్నారు.

By అంజి  Published on  25 Oct 2023 6:28 AM GMT
Telangana, BJP, Congress, Komatireddy Rajgopal Reddy

బీజేపీకి రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతున్నా: రాజ్ గోపాల్ రెడ్డి

సీఎం కేసీఆర్‌ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానని కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోందన్నారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందని, ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారు. అందుకే తాను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నానని రాజ్‌ గోపాల్‌ రెడ్డి తెలిపారు.

''తెలంగాణలో అవినీతి అరాచక నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందని భావించి 15 నెలల క్రితం నేను మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమీషా, బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డా ఆశీస్సులతో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశాను. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు మరో వంద మంది ఇతర సీనియర్ నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేసి, భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడింది. మునుగోడు ఉప ఎన్నికల్లో నా విజయం కోసం ప్రయత్నించిన బిజెపి నేతలు కార్యకర్తలు శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను'' అని రాజ్‌ గోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు.

అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయని, అధికార బీఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదగలేక పోవడంతో ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చిందన్నారు. సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల కెసిఆర్ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పిందన్నారు. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తాను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని రాజ్‌గోపాల్‌ రెడ్డి తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని, మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తనకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.

''నాడు కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరినా, నేడు బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి మారుతున్నా లక్ష్యం మాత్రం ఒకటే. కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే. నేను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదు, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డాను. నియంత కెసిఆర్ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న నన్ను ఆదరించండి'' అని రాష్ట్ర ప్రజలని రాజ్‌ గోపాల్‌ రెడ్డి కోరారు.

Next Story