నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదు : టీఆర్ఎస్‌పై రాహుల్ కామెంట్స్‌

Rahul Gandhi Comments On TRS Party. మోదీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారని.. ఇది దేశానికి నష్టదాయకమ‌ని

By Medi Samrat  Published on  31 Oct 2022 9:50 AM GMT
నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదు : టీఆర్ఎస్‌పై రాహుల్ కామెంట్స్‌

మోదీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారని.. ఇది దేశానికి నష్టదాయకమ‌ని కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ అన్నారు. మీడియా ఇంటరాక్షన్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన లేకుండా చేశారని.. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయని విమ‌ర్శించారు. సంపదను కొద్ది మంది వ్యాపారుల చేతుల్లో పెడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశ సమైక్యత కోసమే మేం భారత్ జోడో యాత్ర చేపట్టాం.. బీజేపీ విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలనే మా ప్రయత్నం అని తెలిపారు.

మేం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రూట్ ను ఎంచుకున్నాము. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాలలో యాత్ర కొనసాగేలా చేసుకున్నాం. అంతే కాని గుజరాత్ లో యాత్ర సాగించకూడదని కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ.. ఇక్కడ నియంతృత్వం ఉండదు. ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకుందని.. కానీ బీజేపీ, టీఆర్ఎస్, ఇతర పార్టీలు ఎప్పుడైనా ఇలా ఎన్నుకున్నాయా? అని ప్ర‌శ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు ఒకటే అని పదే పదే చెబుతున్నా.. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్ప‌ష్టం చేశారు.

అవినీతిమయమైన, ప్రజా ధనాన్ని లూటీ చేసే ఆ పార్టీతో పొత్తు ఉండదని నొక్కి చెప్పారు. రాజకీయంగా కొందరు నాయకులు ఎవరికి వారు తమది పెద్ద పార్టీగా ఊహించుకోవచ్చు.. టీఆర్ఎస్ కూడా తమకు తాము నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదని అన్నారు.

చాలా సంవత్సరాల క్రితమే నేను భారత్ జోడో యాత్ర చేయాలనుకున్నా.. కానీ కోవిడ్ విజృంభించడం, ఇతర కారణాల తో చేయలేకపోయాన‌ని.. ఈ యాత్రతో వ్యక్తిగతంగా ఎన్నో నేర్చుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కూడా ఈ యాత్ర ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదు.. ఖచ్చితంగా పొలిటికల్ యాత్రేన‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రను కొనసాగించడమే నా లక్ష్యం. రాజకీయపరమైన అంశాలపై యాత్ర ముగిశాకే మాట్లాడుతాన‌ని వివ‌రించారు. ప్రజలతో మమేకమవడానికి ఈ యాత్ర ఒక గొప్ప ముందడుగని పేర్కొన్నారు.


Next Story