ఫోన్ ట్యాపింగ్ కేసు..స్టేట్‌మెంట్ ఇవ్వాలని బీజేపీ ఎంపీకి సిట్ నోటీసు

చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

By Knakam Karthik
Published on : 26 Jun 2025 11:55 AM IST

Telangana, Phone tapping case, Konda Vishweshwar Reddy, SIT

ఫోన్ ట్యాపింగ్ కేసు..స్టేట్‌మెంట్ ఇవ్వాలని బీజేపీ ఎంపీకి సిట్ నోటీసు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన విచారణలో కీలక విషయాలను గుర్తించిన సిట్ అధికారులు ట్యాపింగ్‌కు గురైన నేతలకు నోటీసులు ఇచ్చి..వాంగ్మూలాలను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు.

అయితే 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 4013 ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాప్ చేసినట్లు ఐడెంటిఫై చేశారు. వీరిలో 618 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు నిర్ధారించారు. 618 మందిలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ , పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు, రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 618 మంది స్టేట్‌మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. కాగా ఇప్పటివరకు 228 మంది వాంగ్మూలాలను సిట్ అధికారులు పూర్తి చేశారు.

Next Story