తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు..సుప్రీంలో విచారణ మరోసారి వాయిదా
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
By Knakam Karthik Published on 25 Feb 2025 1:26 PM IST
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు..సుప్రీంలో విచారణ మరోసారి వాయిదా
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో మంగళవారం జరిగిన విచారణ మరోసారి వాయిదా పడింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే.. ఇవాళ్టి విచారణకు అసెంబ్లీ సెక్రటరీ తరపు లాయర్ ముకుల్ రోహత్గీ హాజరుకాలేదు. దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ ప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, అన్ని పిటిషన్లను ఒకే దగ్గర కలిపి సుప్రీం ధర్మాసనం ఇప్పటికే విచారణ చేపట్టింది.
గత విచారణలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని స్పీకర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. తగిన సమయం కావాలంటూ కోర్టును అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తీసుకున్న 10 నెలల కాలం రీజనబుల్ టైం కాదా అని ప్రశ్నించింది. ఎమ్మెల్యే అనర్హతపై స్పీకర్ సమయం నిర్దేశించకపోతే.. తామే కలుగజేసుకోవాల్సి ఉంటుందని కోర్టు వ్యాఖ్యలు చేస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. కానీ, అసెంబ్లీ సెక్రటరీ తరఫు లాయర్ ముకుల్ రోహత్గి విచారణకు గైర్హాజరు కావడంతో సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా చేస్తున్నట్లు ప్రకటించింది.