కాంగ్రెస్కు పాల్వాయి స్రవంతి రాజీనామా
మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నేడు రాజీనామా చేశారు.
By Medi Samrat
మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నేడు రాజీనామా చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శుక్రవారం జరిగిన రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సైతం ఆమె దూరంగా ఉన్నారు. తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ పంపించారు. నేడో రేపో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
తన రాజీనామా లేఖను పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి పంపించానని పాల్వాయి స్రవంతి చెప్పారు. పార్టీ వీడేందుకు దారితీసిన పరిస్థితులు, నాయకత్వం తీరుపై ఆ లేఖలో వివరించానని పాల్వాయి స్రవంతి అన్నారు. ఇటీవల పదవులు, టిక్కెట్ల కేటాయింపుల్లో అవకతవకలు కనిపిస్తున్నాయని స్రవంతి ఆరోపించారు. తన తండ్రి గోవర్ధన్ రెడ్డి అరవై ఏళ్ల పాటు ఇదే పార్టీలో ఉన్నారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కార్పోరేట్ పార్టీగా మారిందని ఆరోపించారు. మంత్రి జగదీశ్ రెడ్డి తన ఇంటికొచ్చి బీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడాల్సి రావడం తనకు బాధగానే ఉందన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలలో తన తండ్రి పాత్ర ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ చచ్చిపోయిందని పార్టీని విడిచి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి తిరిగి వస్తే మళ్లీ కండువా కప్పారని.. పైగా ఆయనకు 24 గంటల్లో మునుగోడు టిక్కెట్ కేటాయించారన్నారు. పార్టీ ఇంచార్జ్గా ఉన్న తనకు కనీసం మాట కూడా చెప్పలేదన్నారు.