కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివ‌రాలివే..

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్​ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది.

By -  Medi Samrat
Published on : 25 Sept 2025 2:53 PM IST

కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివ‌రాలివే..

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్​ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం దుకాణాల కోసం టెండర్లు నిర్వహిస్తారు. 2025 డిసెంబర్​ 1 నుంచి 2027 నవంబర్​ 30 వరకు లైసెన్స్​ల కోసం ఆగస్టులోనే ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. అయితే దుకాణాల రిజర్వేషన్​, దరఖాస్తు తేదీలపై తాజాగా వివరాలు వెల్లడించింది. ఈ మేరకు ఎక్సైజ్​ శాఖ కమిషనర్​ హరి కిరణ్​ ఉత్తర్వులు జారీ చేశారు.

మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం గౌడ్​లకు రిజర్వేషన్​ అమలు చేయగా.. తాజాగా కాంగ్రెస్​ ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్​ అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది.




ఆయా జిల్లాల వారీగా దుకాణాలకు రిజర్వేషన్​ వర్తింపజేయనున్నారు. ఏ దుకాణానికి ఏ రిజర్వేషన్ అమలు చేయాలనే దాని కోసం సెప్టెంబర్​ 25న కలెక్టర్​ ఆధ్వర్యంలో డ్రా తీస్తారు. అనంతరం 26న నోటిఫికేషన్​ రిలీజ్​ చేస్తారు. అదే రోజు నుంచి కొత్త దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్​ 18 వరకు దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అక్టోబర్​ 23న కొత్త దుకాణాల కేటాయింపు కోసం డ్రా తీస్తారు. దుకాణాలు దక్కించుకున్న వారు అక్టోబర్​ 23, 24 తేదీల్లో మొదటి విడత లైసెన్స్​ ఫీజు చెల్లించాలి. డిసెంబర్​ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం అవుతాయి.

ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవడానికి రూ.3 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ మొత్తం రూ.2 లక్షలు ఉండగా.. తాజాగా రూ.లక్ష పెంచారు. దీంతో దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది.

Next Story