హైదరాబాద్: ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రకటించింది. నైని బొగ్గు బ్లాక్ పై వరుస ఆరోపణల నేపథ్యంలో నిన్న హైదరాబాద్ సింగరేణి భవన్ లో అత్యవసర బోర్డు సమావేశం అయింది. ఈ మేరకు పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. నైనీ కోల్ మైన్స్ టెండర్ల విషయంలో ఇటీవల తీవ్ర ఆరోపణలు రావడంతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, గనుల శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పందించి టెండర్లు రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.
కాగా నైనీ టెండర్ల విషయంలో సింగరేణి పాలకమండలిని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రశ్నించింది. సంస్థ విధించిన నిబంధనలపై పాలకమండలి ఎందుకు చర్చించలేదని సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని.. నిబంధనలు, టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు తెలిపారు.