ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా.. 600 చదరపు అడుగులకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని బట్టి ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మే నెల మొదటి వారంలోపు ప్రతి నియోజకవర్గంలో 3,500 మంది లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
200 ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని, అనర్హులను ఎంపిక చేస్తే గెజిటెడ్ అధికారిదే బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉంటేనే బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. మంగళవారం సచివాలయంలో భూభారతి, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీతో ముగియనున్న ఎల్ఆర్ఎస్ గడువును మరోసారి పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.