అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయి : ఎమ్మెల్సీ కవిత
అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
By Medi Samrat
అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులు మొత్తం రూ. 4 లక్షల 42 వేలు అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ 8 లక్షల కోట్లు అప్పులు చేశామని దష్ప్రచారం చేస్తున్నారు.. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు. అబద్దాలు చెబుతున్నామని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుందన్నారు.
కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోతాయన్నదానిలో వాస్తవం లేదని స్వయంగా ఇరిగేషన్ మంత్రి మండలిలో చెప్పారు.. నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కాదా.? అని ప్రశ్నించారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుగుతుంది. మహాకుంభమేళ తరహాలో రజతోత్సవ సభ జరుగుతుందన్నారు. 25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శాసన మండలిలో ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ వ్యవహరించింది. సమన్వయంతో అన్ని అవకాశాలను వాడుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించామని పేర్కొన్నారు. అన్ని చర్చల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాము.. ప్రజలు, రైతులు, మహిళలు వంటి అన్ని సమస్యలపై గళమెత్తాము.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రతీ రోజూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపామని పేర్కొన్నారు.
కేసీఆర్పై ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా సభలో నిరసన తెలిపాము. ఫీజు రీయింబర్స్ మెంట్పై మేము చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది.. అప్పటికప్పుడు ఫీజు రియింబర్స్ మెంట్ నిధులను విడుదల చేస్తామని మండలి సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారు.. ఈ ప్రకటన అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
ఈ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయి. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయి.. ఆ బిల్లులు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కృష్టి ఫలితం ఎంతో ఉందన్నారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలను ఉద్ధేశించి పరుషపదజాలంతో ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడారు.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చరిత్రలో నల్ల మరకగా ఉండిపోనున్నాయన్నారు.