బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది : ఎమ్మెల్సీ కవిత

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

By Medi Samrat
Published on : 8 July 2025 3:45 PM IST

బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది : ఎమ్మెల్సీ కవిత

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై మంగళవారం ఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్ క్లబ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న మోసానికి నిరసనగా, బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత... “ఒక్క రైలు చక్రాన్ని కూడా కదలనివ్వబోము. డెక్కన్ నుంచి ఢిల్లీకి రైళ్లను రానిచ్చేదే లేదు. ఆ స్థాయిలో రైల్ రోకో చేపడుతాము. బిల్లును ఆమోదించకపోతే రెండున్నర కోట్ల తెలంగాణ బీసీ బిడ్డలు బీజేపీకి గుణపాఠం చెబుతారు” అని వ్యాఖ్యానించారు. రైల్ రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని, బిల్లును ఆమోదించకపోతే భవిష్యత్తులో నిరవధికంగా రైల్ రోకో ను నిర్వహిస్తామని హెచ్చరించారు. బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని మండిపడ్డారు. రైల్ రోకోకు మద్ధతు, బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో అన్ని పార్టీలకు లేఖలు రాస్తానని తెలిపారు.

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తాము చేసిన పోరాటాలు, ఉద్యమాలతో దిగొచ్చిన ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. 2014లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పియిన తర్వాత రాహుల్ గాంధీకి అకస్మాత్తు బీసీల పట్ల ప్రేమను ఒలకపోయడం మొదలుపెట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇంకా కులగణన నిర్వహించలేదని ఎండగట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (డీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి పెంచిన రిజర్వేషన్లను అమలు చేయవచ్చని, కాబట్టి రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఫోన్ కాల్ చేసి జీవో ఇవ్వమని ఎందుకు సూచించడం లేదు ? 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో జీవో ఇప్పించాలని రాహుల్ గాంధీకి డిమాండ్ చేశారు.

తాము ఓబీసీనని చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ వర్గాలకు న్యాయం చేసే అవకాశం లభించిందని, తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా చొరువ తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో అమలవుతున్న 69 శాతం రిజర్వేషన్ల తరహాలో తెలంగాణ బీసీ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని ప్రతిపాదించారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీసీలను మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ ముఖ్యమంత్రి అంత దూరం ఆలోచించకుండా ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బీజేపీ కృష్టి చేయాలని, అప్పుడే ఆ పార్టీని ప్రజలు విశ్వసిస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా బీసీ బిల్లు గురించి మాట్లాడకపోవడం దారుణమని మండిపడ్డారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీం కోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిదాటిపోయిందని, 16 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని, కాబట్టి రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి న్యాయపరమైన చిక్కులు ఉండవని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో అనేక లోపాలు ఉన్నాయని, 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 52 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందని, ఇప్పుడు కాంగ్రెస్ చేపట్టిన సర్వేలో బీసీలు కేవలం 46 శాతం మాత్రమే ఉన్నట్లు తేల్చారని వివరించారు.

కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో హాఫ్ సెంచరీ చేశారని, రాష్ట్రంతో తక్కువ.. ఢిల్లీలో ఎక్కువగా ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని పరిరక్షించడమే కాకుండా అభివృద్ధి చేయడంలో ముందుందని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, ఒడిశాలో నవీన్ పట్నాయక్, తమిళనాడులో జయలలిత వంటి వారి నాయకత్వంలోని ఆయా పార్టీల ద్వారా ప్రజలకు లబ్ది జరిగిందని అన్నారు

Next Story