ఆ టెండర్లు రద్దు చేయాలి..సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత లేఖ
జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టంట్ రిపేయిర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
By Knakam Karthik
ఆ టెండర్లు రద్దు చేయాలి..సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత లేఖ
జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టంట్ రిపేయిర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని వెల్లడించారు. ఆ సంస్థకు హైదరాబాద్ రెండు షోరూములు మాత్రమే ఉన్నాయి.. ఆ షోరూంలో నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారు.. తెలంగాణ కాంట్రాక్టర్లు కర్ణాటక షోరూముల డీలర్ల నుంచి ఎంవోయూలు తెచ్చుకున్నా.. వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.
ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని, ఇప్పుడు తొమ్మిది జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదన్నారు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో రెండు నుంచి మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించేవారని గుర్తుకు చేశారు. అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్టు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి రూ.5.85 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. కాబట్టి ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి.. గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని సూచించారు.