ఎమ్మెల్యే గోపీనాథ్‌ కన్నుమూత.. సీఎంలు రేవంత్‌, చంద్రబాబు సంతాపం

జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

By అంజి
Published on : 8 Jun 2025 8:35 AM IST

MLA Gopinath , CM Revanth, CM Chandrababu, Telangana, Hyderabad

ఎమ్మెల్యే గోపీనాథ్‌ కన్నుమూత.. సీఎంలు రేవంత్‌, చంద్రబాబు సంతాపం

జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. గోపీనాథ్‌కు భార్య సునీత, కుమారుడు వాత్సల్యనాథ్‌, కుమార్తె అక్షరనాగ ఉన్నారు. జూబ్లీహిల్స్ నుంచి వరుగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా పని చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story