అక్రమంగా ఎవరు కట్టినా కూల్చుడే.. సీఎం సోదరుడికి నోటీసులివ్వడం హర్షించదగ్గ విష‌యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌పై స్పందించారు

By Medi Samrat  Published on  29 Aug 2024 12:06 PM GMT
అక్రమంగా ఎవరు కట్టినా కూల్చుడే.. సీఎం సోదరుడికి నోటీసులివ్వడం హర్షించదగ్గ విష‌యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. హరీష్ రావు చిట్ చాట్ కాదు.. సోది చాట్ అని ఎద్దేవా చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి ఏం చెయ్యలేదన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంటే ఈర్ష్య పడుతున్నారు.. అందుకే అది చిట్ చాట్ కాదు సోది చాట్ అన్నారు. ప‌దేళ్ల‌లో హైడ్రా లాంటిది ఎందుకు పెట్టలేదని ప్ర‌శ్నించారు.

సీఎం రేవంత్ రైతు రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో నిలిచిపోయారని.. బీఆర్ఎస్ పావలా పావలా ఇచ్చింది.. అదీ నాలుగు సార్లు ఇచ్చింద‌న్నారు. వరంగల్ లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామ‌న్నారు. అవాకులు చెవాకులు మానేసి ప్రజా పాలనకు సహకరించండని సూచించారు. మూసీ ప్రక్షాళన ఎందుకు చెయ్యలేదని ప్ర‌శ్నించారు. స్కిల్ యూనివర్సిటీ, ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. చెరువులను నాలాలను రక్షించే పనిలో ప్రభుత్వం వుందన్నారు. చెరువును కబ్జాచేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చామ‌న్నారు. రేవంత్ ఏ పనిచేసినా ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు.

రాహుల్ గాంధీ విశ్వసం పొందిన రేవంత్ సీఎం అయ్యారని పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడ్తుంటే గగ్గోలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఐటీ రంగాన్ని తెలంగాణకు పరిచయం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడ్తామంటే అడ్డుపడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కొన్ని టెక్నీకల్ సమస్యలతో కొందరికి రుణమాఫీ కాలేదన్నారు. అవి కూడా స్పెషల్ డ్రై పెట్టి చేస్తున్నామ‌న్నారు. నా నియోజకవర్గంలో రుణమాఫీ కాలేదని అసత్యపు ప్రచారం చేస్తున్నారు. ఈర్ష్య, ద్వేషాలతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. హైడ్రా ముందు పార్టీలు, కులాలు, మతాలు లేవని.. అక్రమంగా ఎవరు కట్టినా కూల్చుడే అన్నారు. సీఎం సోదరుడికి నోటీసులు ఇవ్వడం హర్షించదగ్గ నిర్ణయం అన్నారు. మంత్రి పొంగులేటి కూడా హైడ్రా పరిధిలో ఉంటే కూల్చండి అని చెప్పారని గుర్తుచేశారు. వేములవాడ నియోజకవర్గంలో కూడా హైడ్రాను ఏర్పాటు చేయాలన్నారు

బీజేపీ నేతల్లో క్లారిటీ లేదు.. వారిలో ఒకరు హైడ్రాకు మద్దతిస్తే.. మరొకరు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ముందుగా బీజేపీ నేతలు హైడ్రాపై అవగాహనా కల్పించుకోండని సూచించారు. సామాన్య ప్రజలు అయినా.. ధనవంతులైనా హైడ్రా ముందు ఒక్కటేన‌న్నారు.

Next Story