తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. రైతుల కోసం 'గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం' పథకాన్ని తీసుకొస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద విత్తనాలు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
సుమారు 40 వేల మంది రైతులకు.. ఈ పథకం కింద వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన నాణ్యమైన 2500 - 3500 క్వింటాళ్ల విత్తనాలను అందజేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 23,364 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పోయిన నెల కురిసిన వర్షాలకు 8,408 ఎకరాల దెబ్బతిన్నట్టు నిర్ధారణ అయిందని, బాధిత రైతులకు త్వరలోనే పరిహారం అందిస్తామని తెలిపారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు 14,956 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేసినట్టు తెలిపారు.