తెలంగాణలో రైతు భరోసా నిధుల జమపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. సోమవారం 15 ఎకరాల వరకు రైతుల అకౌంట్లలో రూ.513 కోట్లు నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. తాజా నిధులతో కలిపి ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8284 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.
వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 6 వేల చొప్పున పెట్టుబడి సాయం నిధులను సోమవారం నుంచి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తొలి రోజు రెండు ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, అనంతరం 4 ఎకరాలు, ఐదో రోజు 7 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేస్తూ వచ్చింది. ఇక మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా.. సాగు భూమికి రైతు భరోసా సాయం అందజేస్తామని మంత్రి తుమ్మల ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.