ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే బాగా తెలుసు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకే బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
By - Medi Samrat |
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకే బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హెచ్-1బీ వీసా రుసుంను ఏటా లక్ష డాలర్లకు పెంచితే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది...? దీని వెనుకున్న మర్మమేంటి...? అని శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన ప్రశ్నించారు. హెచ్ – 1బీ వీసా పొందేవారిలో సుమారు 72 నుంచి 73 శాతం మంది భారతీయులేనని, ఈ ప్రభావం భారత్ పైనే అధికం ఉంటుందని వివరించారు. "2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ కు రికార్డు స్థాయిలో 135.46 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ వచ్చాయి. ఇందులో అమెరికా వాటా 27.7 శాతం. ట్రంప్ తాజా నిర్ణయంతో మనకొచ్చే రెమిటెన్స్ తగ్గిపోతాయి. ఆ ప్రభావం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై పడుతుంది. ఈ విషయం తెలిసినా ముందస్తుగా అమెరికాతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చొరవ చూపలేదు. కనీసం ప్రస్తుతం ఉన్న అమెరికాలో ఉన్న హెచ్- 1బీ వీసాదారులకు మినహాయింపులను సాధించడంలోనూ విఫలమయ్యింది’ అని విమర్శించారు. ‘భారత్ కు నష్టం చేకూర్చేలా ట్రంప్ ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించారు. ఇప్పుడేమో హెచ్ – 1బీ వీసా ఫీజును పెంచారు. మన ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతున్నా ప్రధాని మోదీ మాత్రం స్పందించడం లేదు. పైగా... ఇది మన మంచికే అంటూ వ్యాఖ్యనించడం దురదృష్టకరం’ అని అన్నారు. ‘ఇప్పటికైనా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి మేల్కోని సమస్య పరిష్కారానికి నేరుగా అమెరికాతో చర్చించాలి. కనీసం ఇప్పటికే అక్కడున్న హెచ్ – 1బీ వీసాదారులకు తాత్కాలిక మినహాయింపు కల్పించడంపై దృష్టి సారించాలి. భారతీయ ఐటీ నిపుణులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. రెమిటెన్స్ పై ఆధారపడే కుటుంబాలు, సంస్థల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలి’ అని కోరారు. ‘భారతదేశానికొచ్చే మొత్తం రెమిటెన్స్ లో తెలంగాణ దేశంలో 8.1 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉంది. ట్రంప్ నిర్ణయం వల్ల అధికంగా ప్రభావం పడే రాష్ట్రాల్లో మనది ఒకటి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ... ప్రత్యేకంగా లేఖ రాస్తాం’ అని వివరించారు. ‘రాష్ట్రాల హక్కులను హరించడంలో బిజీగా ఉన్న కేంద్రానికి మన భారతీయుల గురించి ఆలోచించే తీరిక లేదు. రాజ్యాంగం ప్రకారం భారతదేశం అంటే రాష్ట్రాల సమూహం. కానీ... కేంద్రానికి మాత్రం బీజేపీ అధికారంలో ఉన్న వాటినే రాష్ట్రాలుగా పరిగణిస్తుంది. ఏ విషయంలోనూ తెలంగాణను రాష్ట్రంగా పరిగణించడం లేదు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని వాపోయారు.