పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు
By - Knakam Karthik |
పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. మార్చి 1వ తేదీ నుంచి 35 లక్షల మంది మహిళలకు ఉచిత చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరల పంపిణీ టార్గెట్గా పెట్టుకున్నట్లు చెప్పిన ఆమె, ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 50 లక్షల మంది మహిళలకు చీరలు అందించామని, మిగిలిన 15 లక్షల మంది మహిళలకు సంక్రాంతి వరకు పంపిణీ చేస్తామన్నారు. కాగా ఈ వివరాలను శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సీతక్క వెల్లడించారు.
మరో వైపు మహిళా సంఘాల ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు కూడా మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం ద్వారా రాష్ట్ర మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని,ఇప్పటివరకు 250 మహిళా స్వయం సహాయ క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి సభ్యురాలికి రూ.22,300 చొప్పున ఇవ్వడం ద్వారా నిర్వహణ, వంటల తయారీపై శిక్షణ అందించామని తెలిపారు.
యాదగిరిగుట్ట వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. మేడారంలో బొంగు చికెన్ స్టాల్ ను మహిళలకు కేటాయించి, బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించి 500 చికెన్ షాపులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి మండల సమాఖ్యకు బస్సులు అందజేయనున్నట్లు చెప్పారు. మహిళా స్వయం సహాయక బృందాలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే పేదలకు రుణాలు అందిస్తున్నాయని వివరించారు.