మంత్రి సీతక్క తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్ల పంపిణీలో అవినీతి జరిగిందంటూ బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం చేస్తున్న ఆరోపణలు కేవలం తన వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నాలని ఆమె మండిపడ్డారు. పార్టీ బాధ్యుడిగా ఈ తప్పుడు ప్రచారానికి కేసీఆరే జవాబుదారీ వహించాలని ఆమె స్పష్టం చేశారు.
ఒక్కో ఫోన్ను మార్కెట్ ధర కంటే ఎక్కువగా కొనుగోలు చేసి మంత్రి కమీషన్లు తీసుకున్నారన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన ఆమె, అత్యంత పారదర్శకంగా కేవలం రూ. 11,650కే వీటిని కొనుగోలు చేసినట్లు వివరణ ఇచ్చారు. 48 గంటల్లోగా ఆ అబద్ధపు పోస్టులను తొలగించి, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు.