ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటుకు చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. ఏపీ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు.
అయితే, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పున విభజన చట్టం 2014లో తెలంగాణకు పలు కీలక హామీలు ఉన్నాయని.. వాటి అమలు విషయంలో కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి ముఖ్య ప్రాజెక్టులు ఇంకా ఆచరణకు నోచుకోలేదని.. ఇవి తెలంగాణ అభివృద్ధికి కీలకమని ఆయన గుర్తుచేశారు. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి అంశాల్లో కూడా కేంద్రం మాట తప్పిందని ఆరోపించారు.
ఒక రాష్ట్రానికి చట్టబద్ధతతో ముందుకు తీసుకెళ్లే చర్యలు తీసుకుంటూ, మరో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించడం సరైంది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.