బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసింది.. అధ్యక్షుడి మార్పుపై మంత్రి పొన్నం సంచ‌ల‌న‌ కామెంట్స్‌

బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

By Medi Samrat
Published on : 30 Jun 2025 6:50 PM IST

బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసింది.. అధ్యక్షుడి మార్పుపై మంత్రి పొన్నం సంచ‌ల‌న‌ కామెంట్స్‌

బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్నా, బీసీ సీనియర్ నేతలు ఉన్నా బీజేపీ అధ్యక్షుడు కావడానికి వారికి అన్ని అర్హతలు ఉన్నా ఇవ్వలేదన్నారు. గతంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. కనీసం సభాపక్ష నాయకుడిని కూడా బీసీలకు ఇవ్వలేదన్నారు. బీజేపీ ఫ్యూడల్ పార్టీ.. బీజేపీలో బీసీలకు ఎప్పుడూ న్యాయం జరగలేదన్నారు.

బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడిని నామినేషన్ వేయకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరించారని.. ఆయన మద్దతుదారులను భయబ్రాంతులకు గురి చేశారని.. బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు.. దీనికి బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెప్తుందని ప్ర‌శ్నించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం.. బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే.. పీసీసీ అధ్యక్షుడిని బీసీని చేసుకున్నామ‌న్నారు.

మేము ఒకవైపు కుల గణన చేసుకొని బీసీలకు రాజకీయ విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చేస్తూ శాసన సభలో చట్టం చేసుకొని సామాజిక న్యాయం కోసం ముందుకు పోతుంటే.. బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసిందన్నారు.

దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ బీసీల కోసం నినాదాన్ని ఎత్తుకున్నారని అన్నారు. తెలంగాణలో దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు. గతంలో బీజేపీ అధ్యక్షుడు బీసీ నేత బండి సంజయ్ ఉంటే ఎన్నికల సమయంలో ఆయనను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశార‌న్నారు.

Next Story