ప్రధాని మోదీపై, కాంగ్రెస్ పై కేటీఆర్ కౌంటర్లు
Minister KTR Slams Modi And Congress. బీజేపీ ప్రభుత్వం పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 18 Jun 2022 3:45 PM IST
బీజేపీ ప్రభుత్వం పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మహబూబ్నగర్లోని కొల్హాపూర్లో బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ '' కేంద్రం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది. బీజేపీ నేతలు దేశాన్ని రావణకాష్టంలాగా మార్చారు. దేశంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 నుంచి రూ. 1000 దాటింది." అని చెప్పుకొచ్చారు. నల్లధనం తెస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు తెల్లముఖం వేశారని విమర్శించారు. తంబాకు తినడం తప్ప బండి సంజయ్కు ఏమీ తెలియదని కౌంటర్ వేశారు. కాంగ్రెస్కు చరిత్రే మిగిలింది. రాహుల్ గాంధీని గంటల తరబడి ఈడీ ఆఫీసులో కూర్చోబెట్టినా అడిగేవారు లేరన్నారు. ఒక్క ఛాన్స్ అని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 50 ఏళ్లు అధికారం ఇచ్చారు. అన్నేళ్లు ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు.
బీజేపీ తన అనాలోచిత నిర్ణయాలతో దేశాన్ని రావణకాష్టంగా మార్చారన.. బీజేపీ నాయకులు మాట్లాడితే విషం చిమ్ముతున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. హిందూ ముస్లిం మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నారు. కులపిచ్చోడు, మత పిచ్చోడు మనకొద్దు.. మనకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి. అభాగ్యులకు ఆసరాగా నిలిచే ప్రభుత్వం మనకు కావాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం అనేక సమస్యలను ఎదుర్కొన్నామని.. తెలంగాణ ఏర్పాటు తర్వాత మంచి నీటి కష్టాలు లేవన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో రూ. 170 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.