ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించిన‌ మంత్రి జూపల్లి

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంను బట్టి కృష్ణ జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం తత్సార్యం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు

By Medi Samrat  Published on  4 March 2024 2:01 PM GMT
ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించిన‌ మంత్రి జూపల్లి

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంను బట్టి కృష్ణ జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం తత్సార్యం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మంత్రి జూపల్లి ఖండించారు. సెక్రటేరియట్ మీడియా సెంటర్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. నీటి వాటా తేల్చకుండా తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. హడావుడిగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా జలాల్లో నీటి వాటాను ఎందుకు తేల్చడం లేదని ప్ర‌శ్నించారు.

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను ఎందుకు కల్పించడం లేదని అడిగారు. బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలది అవినీతి, బంధుప్రీతి అని ప్రధాని మోదీ విమర్శ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కల్వకుంట్ల కుటుంబానిది అవినీతి, బంధుప్రీతి అంటే ఒక అర్థం ఉంది.. గాడిదను, గుర్రాన్ని ఒక గాటన కట్టడం సరికాదన్నారు.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. ప్రధాని పదవి స్వీకరించకుండా త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీ, రాహుల్ గాంధీది అని కొనియాడారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు అమాయకులు కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కి ప్రజలు బుద్ధి చెప్పుతారన్నారు.

సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలచే ఎంతో మందిని అరెస్ట్ చేపించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, దోపిడీపై ఎందుకు విచారణకు ఆదేశించ లేదో సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ఎందుకు విచారణ చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని తెలిసి కూడా మీరు ఎందుకు దర్యాప్తు చేయించలేదో సమాధానం చెప్పాలన్నారు. కక్ష్య సాధింపులో భాగంగానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపులో తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. కుల, మతాల పేరుతో చిచ్చు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ.. ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

రామరాజ్యం అంటున్నారు కానీ.. ఆ రీతిలో పాలన ఎందుకు సాగించడం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్ళిపోయిన పార్టీ.. పార్టీ నేతలను, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల పేరుతో నాటకాలు ఆడుతున్నారు.. ప్రజలను మభ్యపెడుతున్నారని విమ‌ర్శించారు.

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నాలుగు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. 28 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామ‌ని తెలిపారు. డీఎస్సీ, గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చామ‌న్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి ఒకటో, రెండో సీట్లు వచ్చుడు కూడా కష్టమేన‌న్నారు.

Next Story