కరెంట్ ఉందో లేదో వైర్లు పట్టుకుందామా..? ముందు మీరు.. త‌ర్వాత నేను..!

తెలంగాణ రాజకీయాలు దిగజారుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  8 Nov 2023 10:45 AM GMT
కరెంట్ ఉందో లేదో వైర్లు పట్టుకుందామా..? ముందు మీరు.. త‌ర్వాత నేను..!

తెలంగాణ రాజకీయాలు దిగజారుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యల‌తో క‌లిసి ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు చెప్పుకోవడానికి ఏమి లేక ఇష్టానుసారం అబద్ధాలు, బూతు పదాలు వాడుతున్నారని మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి కేసిఆర్ పై వాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. నీచంగా దిగజారుడు తనంగా అతని భాష ఉందన్నారు. ఒక నాయకుడు మాట్లాడే మాటలు ఇవేనా? అని ఫైర్ అయ్యారు.

టిక్కెట్లు ఇవ్వలేని స్థితిలో వాటిని అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. చేసింది చెప్పుకొని ప్రజలను ఓట్లు అడగచ్చని అన్నారు. కేసిఆర్ పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వాడిన భాషను తీవ్రంగా ఖండించారు. కేసిఆర్ కు రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే మా రాష్ట్రంలో గొప్పగా అభివృద్ది చేశామని చెప్పాలి. కర్ణాటక లో ఇచ్చే కరెంట్ కూడా 3 గంటలు కూడా ఇవ్వలేక పోతున్నాం అని చెప్తారా? అని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ వల్ల తెలంగాణ నాశనం అయ్యిందన్నారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్తితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ యువత ను మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నోటికొచ్చిన అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు. కరెంట్ లేదని ప్రచారం చేస్తున్నారు. కరెంట్ ఉందో లేదో వైర్లు పట్టుకుందామా..? ముందు మీరు పట్టుకోండి బ్రతికి ఉంటే నేను పట్టుకుంటా అని స‌వాల్ చేశారు. అలాగే కర్ణాటకలో కూడా చూద్దామ‌న్నారు.

జానారెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, భట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారని అన్నారు. మీరు ఏరికోరి తెచ్చుకున్న పిసిసి చీఫ్ ఇలా మాట్లాడితే సమర్ధిస్తారా? అని ఫ్ర‌శ్నించారు. ఇవాళ టికెట్లు అమ్ముకున్న వ్యక్తి రేపు రాష్ట్రానికి సీఎం అయితే రాష్ట్రాన్ని ఏం చేస్తారో ప్రజలు గమనించాలన్నారు. బ్రోకర్ పనులు చేసి వచ్చిన వ్యక్తులు పిసిసి చీఫ్ అయితే ఇలాగే ఉంటుందన్నారు. దళిత నేతల దగ్గర కూడా టికెట్ కోసం డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. ఎన్నికలు అన్నప్పుడు పోటీ ఉంటుంది. అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయన్నారు.

బీజేపీకి నాలుగు ఓట్లు వచ్చే పరిస్తితి లేదన్నారు. ఒక్క సీటు కూడా గెలిచే స్థితి లేదు కాబట్టి మోదీ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారని అన్నారు. ఇలా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేక కేసిఆర్ పైన ఆరోపణలు చేయటం పనిగా పెట్టుకున్నారని అన్నారు.

Next Story