ఆ పార్టీల అధ్యక్షులు మారినా..బీఆర్ఎస్‌ను ఆపలేరు: హరీశ్‌రావు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌కు మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  10 July 2023 11:00 AM GMT
Minister Harish Rao, BRS, Congress, BJP, Telangana,

ఆ పార్టీల అధ్యక్షులు మారినా..బీఆర్ఎస్‌ను ఆపలేరు: హరీశ్‌రావు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చడం.. ఆ తర్వాత పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరడం ఇలా అనూహ్య పరిణామాలను చూశాం. తాజాగా ఈ ఘటనలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కౌంటర్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ పటాన్‌చెరులో పలు అభివృద్ధి కార్యక్రమలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై ఆయన ఫైర్ అయ్యారు.

కొన్ని పార్టీలు అధ్యక్షుల్ని మార్చినా, ఔట్‌డేటెడ్‌ నాయకులకు పదవులు కట్టబెట్టిన ఎన్నికల్లో వారికి ఎలాంటి ప్రయోజనం దక్కదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్‌ అనీ.. ముచ్చటగా మూడోసారి అధికారం చేపడతామని దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ గెలుపుని ఎవరూ ఆపలేరని అన్నారు. తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణపైనే కాదు దక్షిణాది రాష్ట్రాలంటేనే బీజేపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు..? ఆ పార్టీ ఎన్నికల కోసం అధ్యక్షుడిని మార్చి ఏవేవో ప్రయత్నాలు చేస్తోందని.. తెలంగాణలో అధికారంలోకి రావడం బీజేపీతో సాధ్యం కాదని.. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

చాలా కాలంపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేయలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీ రూ.4వేల పెన్షన్‌ను అమలు చేయాలని సూచించారు. ఆ తర్వాత తెలంగాణలో రూ.4వేల పెన్షన్‌ హామీ గురించి మాట్లాడాలని హరీశ్‌రావు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్‌ వంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరించిన లీడర్లు, స్క్రాప్‌ లీడర్లు కాంగ్రెస్, బీజేపీల్లో చేరిన పోయేదేమీ లేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్‌ తుపానుకి కొట్టుకుపోవాల్సిందే అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్‌ అని చెప్పారు మంత్రి హరీశ్‌రావు.

పటాన్‌చెరులో స్థానిక నాయకులతో కలిసి ఫ్రీడమ్‌ పార్క్‌ని ప్రారంభించారు మంత్రి హరీశ్‌రావు. అనంతరం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంకు భవనాన్ని ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ వార్డు కార్యలయ భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.

Next Story