ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిది, భక్తితో పనిచేయాలి: సీఎం రేవంత్
పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By - Knakam Karthik |
ములుగు: పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడారం ఆలయ అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధి, విస్తరణకు సమబంధించిన ప్రణాళిక, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు వివరించిన అధికారులు సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆలయాన్ని విస్తరణ, అభివృద్ధిని పూజారులు, ఆదివాసీ సంఘాలు ఏకీభవించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిన ఆదివాసీ సంఘాలు.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఆదివాసీలు దేశానికి మూలవాసులు పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మలు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను సందర్శిస్తున్నా ఫిబ్రవరి 6, 2023 న ఈ గడ్డమీద నుంచే పాదయాత్ర మొదలుపెట్టా. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించి శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో మీ అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. సంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండాలనేదే మా అభిమతం ఇది డబ్బులతో కొలిచేది కాదు.. నమ్మకంతో కొలిచేది. ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలి.. వందరోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలి..అని సీఎం అధికారులను ఆదేశించారు.
రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలి. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క సారలమ్మ ఆలయం ఉంది .ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములయిన వారి జన్మ ధన్యమవుతుంది. ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిది ఆదాయం ఆశించి కాదు… భక్తితో పనిచేయాలి. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా పనిచేయాలి, జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలి. అవసరమైనచోట చెక్ డ్యామ్ లు నిర్మించాలి, రాబోయే వంద రోజులు సమ్మక్క సారలమ్మ మాలధారణ చేసినట్లుగా నిష్ఠతో పనిచేయాలి, నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పనులు పూర్తి చేయించుకునే బాధ్యత మీపై ఉంది. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా..అని సీఎం పేర్కొన్నారు.