దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు : మల్లు రవి

దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

By Medi Samrat  Published on  11 March 2024 12:51 PM GMT
దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు : మల్లు రవి

దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. యాదగిరి గుట్టలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు అవమానం జరిగిందని బిఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికి తెలుసన్నారు.

గత బీఆర్ఎస్ పాలనలో భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సీఎల్పీ విలీనం అంటూ కొత్త కథ అల్లి భట్టి విక్రమార్క కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు భట్టి విక్రమార్కకు అవమానం అంటూ మొసలి కన్నీరు కారుస్తుంద‌ని మండిప‌డ్డారు. దళిత ముఖ్యమంత్రి అంటూ ప్రగల్బాలు పలికి దళితులను మోసం చేసిన బీఆర్ఎస్ ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు నమ్మర‌న్నారు.

భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రి గా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేన‌ని వివ‌రించారు. యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి పక్కన నల్గొండ జిల్లా మంత్రులను కోర్చోబెట్టారు.. భద్రాచలం లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కూర్చోబెట్టారయ‌ని తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చాలా సఖ్యతతో, సమన్వయం తో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని స్ప‌ష్టం చేశారు. మీరు కాంగ్రెస్ పార్టీలో జరిగే అంశాలపై మాట్లాడాల్సిన అవసరం లేదని మ‌ల్లు ర‌వి కౌంట‌రిచ్చారు.

Next Story