'ఇంకొసారి ఇలా మాట్లాడొద్దు'.. మంత్రి కొండా సురేఖకు కోర్టు చివాట్లు

మంత్రి కొండా సురేఖకు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చివాట్లు పెట్టింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావాను కోర్టు విచారించింది.

By అంజి  Published on  25 Oct 2024 6:55 AM GMT
KTR, defamation suit case, Minister Konda Surekha, Hyderabad, Telangana

'ఇంకొసారి ఇలా మాట్లాడొద్దు'.. మంత్రి కొండా సురేఖకు కోర్టు చివాట్లు

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖకు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చివాట్లు పెట్టింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావాను కోర్టు విచారించింది. బాధ్యత గల పదవిలో ఉండి ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మందలించింది. ఒక ప్రభుత్వ ప్రతినిధి నుంచి ఇలాంటి మాటలు తీవ్ర అభ్యంతరకరమని, అనూహ్యమని పేర్కొంది. మరోసారి కేటీఆర్‌పై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. తన వ్యాఖ్యలకు సంబంధించి పోస్టులను సోషల్‌ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది.

కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉండవద్దని కోర్టు తెలిపింది.

తన క్యారెక్టర్‌పై నిరాధార ఆరోపణలు చేసినందకు మంత్రి కొండా సురేఖపై కేటీఆర్‌ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. గత కొంత కాలంగా తన క్యారెక్టర్‌ను దిగజార్చేందుకు సోషల్‌ మీడియాలో చేసే ప్రయత్నాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. అంతకుముందు నాగచైతన్య డైవర్స్‌ వంద శాతం కేటీఆర్‌ వల్లే అయిందని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఎన్‌ కన్వెన్షణ్‌ హాల్‌ వివాదంతో ఇది మొదలైందని కేటీఆర్‌, నాగార్జునపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Next Story