ముస్తాబాద్‌లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌.. వివ‌రాలివిగో..

KTR inaugurates 2BHK houses in Sircilla. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్

By Medi Samrat  Published on  14 Feb 2022 8:27 AM GMT
ముస్తాబాద్‌లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌.. వివ‌రాలివిగో..

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న-సిరిసిల్ల జిల్లాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సోమవారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం 2015లో పేదలకు 100% రాయితీతో కూడిన ఇళ్లను అందించడం ద్వారా గౌరవంగా ఉండాలనే ఉద్దేశ్యంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగానే పూర్తైన‌ డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం డిగ్నిటీ హౌసింగ్ ప్రోగ్రాం కింద నిర్మించిన ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఈరోజు లబ్ధిదారులకు అందజేస్తాం. 560 ఎస్‌ఎఫ్‌టితో అన్ని సౌకర్యాలు క‌లిగిన‌ నివాసాన్ని కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందజేస్తుందని ట్వీట్ చేశారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. ''తెలంగాణలో రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. పేద‌లందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారని.. ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంటుందని మంత్రి అన్నారు.

ప్రైవేట్ బిల్డర్ ఇంటిని నిర్మిస్తే దాని నిర్మాణానికి రూ.20-25 లక్షలు పడుతుందని తెలిపారు. రాజకీయాలకు ఆస్కారం లేకుండా అర్హులైన లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చేస్తున్నామని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని, అయినా కొన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయని.. ఇలాంటి పథకాన్ని అమలు చేసే రాష్ట్రం ఏదైనా ఉందా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలు ఇతర రాష్ట్రంలో అమలవుతున్నాయో లేదో చూపాలని ఇతర పార్టీలకు మంత్రి కేటీఆర్‌ సవాల్ విసిరారు.


Next Story