మూడు గంటల పాటు సాగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. సభ్యులకు కేసీఆర్ కీలక సూచనలు
కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది.
By Medi Samrat
కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సహా.. శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సభ్యులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ సభకు నిర్ణీత సమయానికి హాజరు కావాలి. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలి.. బీఆర్ఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు.. ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరతపై అసెంబ్లీలో, మండలిలో పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని సూచించారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరుపై మాట్లాడాలని.. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్.. డీఏల పెండింగు.. పీఆర్సీ అమలుపై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
మహిళలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కొట్లాడాలి.. ఆరు గ్యారంటీ ల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిలదీయాలన్నారు. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు విడుదలచేయక పోవడం గురించి, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, తదితర ప్రహజసమస్యలపై ఎండగట్టాలని సూచించారు. దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాలి.. గొర్రెల పెంపకం.. చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం.. అసెంబ్లీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని పశ్నించాలని అధినేత కేసీఆర్ నేటి సమావేశంలో దిశా నిర్దేశం చేశారు.
కాగా.. అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఎల్పీ సమావేశం పలు అంశాలను చర్చించింది. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. సభల్లో ఇంకా ప్రతిభావంతంగా ప్రజాసమస్యల మీద పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ తెలిపారు.