రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి.. లేదంటే మేము బీహార్కు వస్తాం : కల్వకుంట్ల కవిత
గ్రూప్ -1 అభ్యర్ధులను కలిసేందుకు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్లారు. అయితే.. లైబ్రరీలోకి ఆమెను, జాగృతి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
By - Medi Samrat |
గ్రూప్ -1 అభ్యర్ధులను కలిసేందుకు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్లారు. అయితే.. లైబ్రరీలోకి ఆమెను, జాగృతి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె గేటు వద్దే భైఠాయించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను.. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు కేసీఆర్ పరిపాలనలో కూడా అవకతవకలు జరిగాయని విద్యార్థులు చెప్పారు. ఆనాడైనా, ఈనాడైనా విద్యార్థులకు న్యాయం జరగాలనే నేను కోరుతున్నా. విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. గ్రూప్ -1 లో అక్రమాలు జరిగాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ పెట్టండని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పారదర్శకంగా రిక్రూట్ మెంట్లు చేసి ఉంటే రాత్రికి రాత్రే అపాయింట్ మెంట్లు ఇవ్వాల్సిన అవసరమేముంది? అని ప్రశ్నించారు. మా పేపర్లను ఇస్తామంటూ ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు.. ఉద్యోగాలు వచ్చిన వారి పేపర్లు బయట పెట్టడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు? ర్యాంకర్ల పేపర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతుంది. ప్రతిభ, ధైర్యం ఉన్న విద్యార్థులు ఛాలెంజ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదని ప్రశ్నించారు.
అర్హత లేని వారికి ఉద్యోగాలు రావద్దనే మేము కోరుతున్నాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో తొక్కి నాన్ లోకల్స్ 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో తిరుగుతూ.. తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. రాహుల్ గాంధీ ఇక్కడకు రావాలి. లేదంటే మేము బీహార్ కు వస్తామని హెచ్చరించారు.
రేపు కోర్టులో ఈ అంశంపై విచారణ ఉంది. న్యాయమూర్తులు కూడా ఆలోచన చేయాలని కోరుతున్నా. తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకు అన్యాయం చేశారు. గ్రూప్ -1 రాసిన వాళ్లలో పోలీసోళ్ల పిల్లలు కూడా ఉన్నారు. మీ పిల్లలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారని పోలీసులను అడుగుతున్నా. తెలుగు, ఉర్ధూ మీడియంలో రాసిన అభ్యర్థులకు అన్యాయం చేశారు. ఇది వరకు ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ పాత 50 వేల ఉద్యోగాలే ఇచ్చారు తప్ప ఒక్క కొత్త నోటిఫికేషన్ వేయలేదన్నారు.
తెలంగాణలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పై పార్లమెంట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. గ్రూప్-1 విషయంలో డివిజన్ బెంచ్ లో అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా గ్రూప్ -1 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.