కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు..రిట్ పిటిషన్లపై ఏప్రిల్ 8న తెలంగాణ హైకోర్టు తీర్పు

కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 13 March 2026 8:30 AM IST

Telangana, Kaleshwaram Project, Telangana High Court, KCR, HarishRao, JusticePCGhosh, TelanganaGovernment, IrrigationScam ,JudicialEnquiry

కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు..రిట్ పిటిషన్లపై ఏప్రిల్ 8న తెలంగాణ హైకోర్టు తీర్పు

కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం (KLIS)లో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్.కె. జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన ఈ పిటిషన్లపై తుది తీర్పును ఏప్రిల్ 8న వెలువరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ప్రకటించింది. అప్పటి వరకు కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను ధర్మాసనం పొడిగించింది.

విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు బలమైన వాదనలు వినిపించారు. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం అనుసరించాల్సిన విధానపరమైన నిబంధనలను కమిషన్ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా సెక్షన్ 8B మరియు 8C కింద నోటీసులు జారీ చేయలేదని, దీనివల్ల సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం మరియు కీలక పత్రాలను పరిశీలించే హక్కును పిటిషనర్లు కోల్పోయారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. "రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం కమిషన్ భుజంపై తుపాకీ పెట్టి పేల్చింది. ప్రభుత్వం ముందే అనుకున్న ముగింపులకే కమిషన్ చేరుకుంది" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు ఖర్చులు పెరగడం సహజమని, కేవలం కేఎల్ఐఎస్ విషయంలోనే దీనిని తప్పుగా చిత్రీకరిస్తున్నారని, వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రంలో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెరిగిందని గణాంకాలతో వాదించారు.

మరోవైపు అధికారుల తరపున వాదించిన న్యాయవాదులు.. కేవలం సమాచార సేకరణ కోసం సమావేశానికి పిలిచినట్లు చెప్పి, నివేదికలో తమ ప్రవర్తనను మరియు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవప్రదంగా జీవించడం మరియు ఖ్యాతిని కాపాడుకోవడం ప్రాథమిక హక్కు అని, సరైన నోటీసులు ఇవ్వకుండా నివేదిక ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలను విన్న ధర్మాసనం, విచారణలో భాగంగా మొత్తం 119 మంది సాక్షులకు జారీ చేసిన నోటీసుల ఫార్మాట్ ఎలా ఉంది? పిటిషనర్ల విషయంలో ప్రత్యేకంగా వ్యవహరించారా? అనే అంశాలపై ఆరా తీసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.

Next Story