జేఈఈ మెయిన్‌లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు..బాలికల విభాగంలో దేశంలోనే టాపర్‌

JEE Mains Results 2021. జేఈఈ మెయిన్‌ బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన కే.శరణ్య 99.99 శాతం సాధించగా

By Medi Samrat  Published on  9 March 2021 7:07 AM GMT
జేఈఈ మెయిన్‌లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు..బాలికల విభాగంలో దేశంలోనే టాపర్‌

జేఈఈ మెయిన్‌ బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన కే.శరణ్య 99.99 శాతం సాధించగా, దేశంలోనే టాపర్‌గా నిలిచింది. 99.99 శాతంతో చల్లా విశ్వనాథ్‌ తెలంగాణ టాపర్‌గా నిలిచారు. ఎస్టీ కోటాలో టాప్‌-3 స్థానాలను తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశాలకు గానూ ఫిబ్రవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 (బీఈ,బీటెక్‌) పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ప్రోఖ్రియాల్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు.

దేశ వ్యాప్తంగా ఆరుగురు 100 పర్సంటైల్‌ సాధించగా, అందరూ అబ్బాయిలే. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి కూడా వంద శాతం సాధించలేదు. ఫలితాలను ఎన్డీఏ సోమవారం రాత్రి తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. పరీక్షకు 6.52 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 6.20 మంది హాజరయ్యారు. వాస్తవానికి ఫలితాలు ఆదివారమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యం అయింది. గత ఏడాది కూడా అర్థరాత్రి ఫలితాలు ప్రకటించారు. సాకేత్‌ ఝా (రాజస్థాన్‌), ప్రవార్‌ కఠారియా, రంజిమ్‌, ప్రభల్‌ దాస్‌ (ఢిల్లీ), గురుమృత్‌ (ఛండిగఢ్‌), సిద్ధాంత్‌ ముఖర్జీ (మహారాష్ట్ర), ఆనంద్‌ కృష్ణ (గుజరాత్‌)లు 100 పర్సంటైల్‌ సాధించారు.

ప్రశ్నల్లో చాయిస్‌తో గందరగోళం

అయితే ఈ సంవత్సరం ప్రశ్నల్లో చాయిస్‌నివ్వడం విద్యార్థుల్లో అయోమయానికి దారి తీసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నల్లో ఒకటి తప్పుగా ఉండటంతో ఆ ప్రశ్నను రాసివారికి మార్కులు ఇచ్చారు. ఐదు ప్రశ్నలు రాసినవారికి మార్కులు ఇవ్వకపోవడంతో విద్యార్థులంతా నష్టపోయినట్టు చైతన్య ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆల్‌ ఇండియా ఐఐటీ కో ఆర్డినేటర్‌ ఎం. ఉమాశంకర్‌ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ విద్యార్థుల ఫలితాలు

కే శరణ్య - 99.99 పర్సంటైల్‌(మహిళా కోటాలో జాతీయ స్థాయి టాపర్‌)

చల్లా విశ్వనాథ్‌- 99.99 పర్సంటైల్‌(టాపర్‌గా తెలంగాణ టాపర్‌)

ఇస్లావత్‌ నితిన్‌ - 99.99, బిజిలి ప్రచోతన్‌ వర్మ- 99.98, నేనావత్‌ ప్రీతమ్‌- 99.97 పర్సంటైల్‌తో ఎస్టీ కోటాలో జాతీయ టాపర్లుగా నిలిచారు.

అమేయ విక్రమసింగ్‌ - 99. 99 పర్సంటైల్‌తో (అబ్బాయిల కోటాలో జాతీయస్థాయిలో 8వ ర్యాంక్‌)

అంచ ప్రణవి - 99.99, రామస్వామి సంతోష్‌రెడ్డి - 99.99 పర్సంటైల్‌తో జనరల్‌ (ఈడబ్యూఎస్‌ కోటా)లో ఉత్తమం.




Next Story