నోటికొచ్చింది కాదు, ఆధారాలతో మాట్లాడా..హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

కాళేశ్వరం కమిషన్ విచారణలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను..అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 9 Jun 2025 3:55 PM IST

Telangana, Former Minister Harish Rao, Kaleshwaram Commission, Brs, Congress

నోటికొచ్చింది కాదు, ఆధారాలతో మాట్లాడా..హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

కాళేశ్వరం కమిషన్ విచారణలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను..అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలతో సమాధానాలను కమిషన్ అందించా. కమిషన్ విచారణకు హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదు. రాజకీయాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడతా. లోపట ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం తప్పు అవుతుంది. అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. మొట్టమొదలు తమ్మిడి హట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్‌ను ఎందుకు మార్చారు అనేదానిపై చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేసాము. ఇరిగేషన్ మంత్రిగా రివ్యూ చేసినప్పుడు ప్రాణాహిత ప్రాజెక్టు 7 ప్యాకేజీలు 27 భాగాలుగా టెండర్లను పిలిచింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. తల పనులు స్టార్ట్ చేయకుండా తోక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ గారిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నెలకే వెళ్లి కలవడం జరిగింది. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వండని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్ గారిని కోరడం జరిగింది.

ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హాసన్ ముష్రఫ్ గారు.. చాలా రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు మా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ గారు అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లాం..అని హరీష్‌ రావు చెప్పారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటిపారుదల మంత్రిని కలిసి మళ్లీ తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని, తెలంగాణకు నీటి అవసరం ఉందని కోరడం జరిగింది. స్వయంగా కేసీఆర్ మహారాష్ట్ర వచ్చి అప్పటి గవర్నర్ విద్యాసాగర్ గారి సమక్షంలో బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను కలిశారు. ఏడేండ్లు మాకంటే ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చేసింది తానేనని ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని పడ్నవీస్ తేల్చి చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఏడు సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క అనుమతి కూడా సాధించలేదు. ఒక్క అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు. ఒక గుంట భూమిని కూడా సేకరించలేదు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు.సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదు అని ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖ రాసింది..అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

అదేవిధంగా CWC తమ్మిడిహట్టి ప్రాజెక్టులో ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం కూడా సరిపోదని సామర్థ్యానికి సరిపోయే రిజర్వాయర్లను పెంచుకోవాలని ఉత్తరం రాసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ని బ్యారేజ్ నిర్మాణ స్థల ఎంపిక చేయాలని కేసీఆర్ కోరారు. కేంద్ర సంస్థ వాప్కోస్ లాడార్ సర్వే చేసి, ఎగ్జామిన్ చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉంది అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చని తెలిపింది. వాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజనీర్ల సూచన మేరకు మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడేండ్లుగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేదు. అదేవిధంగా మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న చోట చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. వైల్డ్ లైఫ్ అనుమతులు లభించాలంటే కనీసం 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో కొట్లాడాల్సి వస్తుంది. నీళ్లు లేనిచోట కాంగ్రెస్ ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్నచోట ప్రాజెక్టును బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. అన్ని రకాల ఆధారాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన ఉత్తరాలు, జీవోలు అన్నీ కమిషన్‌కు సమర్పించడం జరిగింది..అని హరీశ్ రావు తెలిపారు.

కాళేశ్వరాన్ని కొంతమంది కూలేశ్వరం అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కెనాల్స్, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగమే కాళేశ్వరం ప్రాజెక్ట్ సమాహారమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే గంధమల్లకు శంకుస్థాపన చేశారని.. అక్కడికి నీళ్లు మల్లన్న సాగర్ నుంచి పోయేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగం కాదా.. అని ప్రశ్నించారు. మరోవైపు హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణకు 30 టీఎంసీల నీళ్లు తీసుకొస్తామని అంటున్నారని.. అవి కూడా మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నామని టెండర్లు పిలుస్తున్నారని కామెంట్ చేశారు. ఇన్ని చేసుకుంటూ మళ్లీ కాళేశ్వరం కూలింది అంటూ కాంగ్రెస్ నేతలను నోటికొచ్చినట్లుగా వాగుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వ డొల్లతనం పూర్తిగా బయటపడిందని.. ఎప్పటికైనా తెలంగాణకు లైఫ్‌లైన్ ఒక్క కాళేశ్వరమేనని విషయం కూడా ప్రజలకు స్పష్టమైందని అన్నారు. కమిషన్ ఎదుట కూడా తాను నోటికి ఏది వస్తే అది మాట్లాడలేదని.. ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో సహా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు డాక్యుమెంట్ ఎవిడెన్స్ రూపంలో వారికి అందజేశానని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Next Story