హైదరాబాద్: ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా 100 సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. మరోవైపు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సీఎం రేవంత్కు హరీశ్ రావు సవాల్ విసిరారు. తమ కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటామని పోలీసులు, అధికారులను హెచ్చరించారు.
ఏపీ ప్రభుత్వం నిర్మించదలచిన బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు శాపమని హరీశ్ రావు విమర్శించారు. ఈ ప్రాజెక్టును ఆపే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలైందని దుయ్యబట్టారు. అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళ్లి బీఆర్ఎస్ అడ్డుకుంటుందని చెప్పారు. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే ప్రాజెక్టును ఆపాలని సవాల్ విసిరారు. మరోవైపు ఎన్నికల్లో ఎవ్వరితోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.