తెలంగాణ అసెంబ్లీ వేదికగా గోదావరి జలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో గోదావరి నీళ్లపై చర్చకు తాము సిద్ధమని, అయితే చర్చ జరుగుతున్నప్పుడు తమ మైక్ కట్ చేయకూడదని, కెమెరాలు పక్కకు తిప్పకూడదని హరీష్ రావు కఠినమైన షరతులు విధించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు లొంగిపోయారని, అందుకే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మేడిగడ్డ, సమ్మక్క బ్యారేజీ, దేవాదుల వంటి కీలక ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి, తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఆంధ్రాకు తరలిస్తున్నారని మండిపడ్డారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చేసుకున్న చీకటి ఒప్పందాలను అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తూ పొరుగు రాష్ట్రానికి నీటిని ధారాదత్తం చేస్తున్న తీరుపై తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.