తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, ఫలితాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉదృత వాతావరణం నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులందరూ కలిసి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. తెలంగాణలో జరిగిన గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో కేవలం మూడు సెంటర్ల నుంచే వంద మందికి పైగా అభ్యర్థులు ఎంపిక అయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫలితాల ప్రకటనలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు మీడియంలో 8 వేల యంది పరీక్ష రాసినా.. అందులో కేవలం 30 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందని గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మాతృ భాష తెలుగులో పరీక్షలు రాయకూడదా? తెలంగాణలో తెలుగును నిషేధిస్తారా.? తెలుగులో రాస్తే ఉద్యోగాలు ఇవ్వరా అంటూ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.