GHMC కీలక నిర్ణయం..ఆ టెండర్లు రద్దు

జీహెచ్‌ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్‌ను రద్దు చేస్తూ జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది.

By Knakam Karthik
Published on : 2 Jun 2025 1:52 PM IST

Telangana, Cm Revanthreddy, Brs Mlc Kavitha, Congress Government, Municipal Department, GHMC

GHMC కీలక నిర్ణయం..ఆ టెండర్లు రద్దు

జీహెచ్‌ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్‌ను రద్దు చేస్తూ జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా టెండర్ల గోల్‌మాల్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. కొద్ది మంది కాంట్రాక్టర్లకు ఉపయోగపడేలా ఎమర్జెన్సీ వాహనాల టెండర్లను పిలిచారంటూ ఆరోపణలు రావడంతో జీహెచ్‌ఎంసీ వెనక్కి తగ్గింది. ఇసుజి వెహికల్స్‌ 150 డివిజన్‌లో ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వీటి వల్ల జీహెచ్‌ఎంసీపై రూ.5 కోట్లకు పైగా భారం పడుతుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో గత ఏడాది మాదిరిగానే టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికల్స్ టెండర్లను జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. అతి త్వరలోనే బల్దియా ట్రాన్స్‌పోర్టు అధికారులు మరోసారి టెండర్లు పిలవనున్నారు.

కవిత రాసిన లేఖలో అంశాలు ఇవే..

జీహెచ్‌ఎంసీలో మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్‌స్టంట్ రిపేయిర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని, ఇప్పుడు తొమ్మిది జోన్‌ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదన్నారు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో రెండు నుంచి మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించేవారని గుర్తుకు చేశారు. అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్టు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి రూ.5.85 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. కాబట్టి ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి.. గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని సూచించారు.

Next Story