కామారెడ్డిలో విషాదం.. కరెంట్‌ షాక్‌తో ఒకే కుటుంబానికి నలుగురు మృతి

Four members of the same family died due to electric shock in Kamareddy. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. విద్యుత్‌ షాక్‌లు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి.

By అంజి  Published on  12 July 2022 10:52 AM GMT
కామారెడ్డిలో విషాదం.. కరెంట్‌ షాక్‌తో ఒకే కుటుంబానికి నలుగురు మృతి

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. విద్యుత్‌ షాక్‌లు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరెంట్‌ షాక్‌ తగిలి ఓ ఫ్యామిలీ అంతా చనిపోయారు. బీడీ వర్కర్స్‌ కాలనీలో నలుగురు కరెంట్‌ షాక్‌తో మృతి చెందారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు హైమద్ (35), పర్వీన్ (30), అద్నాన్ (4), మాహిమ్ (6). మృతి చెందిన వారిలో భార్య భర్తలతో పాటు, వారి ఇద్దరూ పిల్లలు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా అందర్నీ కలచివేసింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలకు ప్రమాదవశాత్తూ కరెంట్‌ వైర్‌ తగిలింది. వాళ్లు ప్రాణాలతో గిలగిలా కొట్టుకోవడం చూసిన తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నలుగురు విద్యుత్‌ షాక్‌ తగిలి స్పాట్‌లో మృతి చెందారు. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత‌దేహాల‌ను కామారెడ్డి ప్ర‌భుత్వ ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story