వరంగల్ లోని పోచమ్మ మైదానం కూడలిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి హాజరయ్యారు. ఆయన పలువురు నేతలను పరోక్షంగా విమర్శించారు. కొండ మురళి పార్టీ మారితే పదవికి రాజీనామా చేసి మారాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూడా పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిందని గుర్తు చేశారు. నాలాగా దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోవాలన్నారు కొండ మురళి.
పరకాలలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడు.. ఆ ముసలోడు నా కాళ్లు పట్టుకుంటే ఎమ్మెల్యేను చేశానని కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తన కూతురు సుస్మితా పటేల్ పోటీ చేస్తుందని ప్రకటించారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ మరోసారి పోటీ చేస్తుందని, తనకు పార్టీ ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇస్తే ఎంత ఖర్చు పెట్టి అయినా సరే గెలుస్తానని కొండా మురళి అన్నారు.