100 సార్లు విచారణకు పిలిచినా వస్తా: కేటీఆర్
ఫార్ములా - ఈ రేసును హైదరాబాద్లో నిర్వహించి నగర ప్రతిష్ఠను పెంచామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
By అంజి
100 సార్లు విచారణకు పిలిచినా వస్తా: కేటీఆర్
హైదరాబాద్: ఫార్ములా - ఈ రేసును హైదరాబాద్లో నిర్వహించి నగర ప్రతిష్ఠను పెంచామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. 'నన్ను 100 సార్లు విచారణకు పిలిచినా వస్తా. నిజాలే చెబుతా. అరెస్ట్ కూఆ చేస్తారు కావచ్చు. 100 సార్లైనా జైలుకు వెళ్తాం.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం' అంటూ ఫైర్ అయ్యారు. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పామన్నారు.
''ఇది మూడోసారి విచారణకు పిలవటం. మూడుసార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినంతమాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించకుండా ఉండం. ప్రశ్నించకుండా ఉంటారనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకం మాత్రమే. కేసీఆర్, హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు. వారిని కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నన్ను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నారు. నన్ను ఏసీబీ విచారణకు పిలిచి రాక్షస ఆనందం పొందుతున్నారు'' అని కేటీఆర్ పేర్కొన్నారు.
''అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చాను. ఫార్ములా ఈ రేసుతో తెలంగాణ ను ప్రపంచంలో నెంబర్ వన్ చేశాం. మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరేవరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక్కసారి కాదు వందసార్లు అయినా జైలుకు పోతాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఇచ్చిన 420 హామీలు దొంగ ఆరు గ్యారెంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవ్వాల్సిందే'' అని కేటీఆర్ అన్నారు.
''స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తోందని సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ రెడ్డి తీరును గమనిస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి ఇప్పుడు వాటిని విస్మరించి స్థానిక సంస్థలకు వెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటిని బీసీ ప్రజలు గమనిస్తున్నారు. రైతుబంధును ఎలక్షన్ బందుగా మార్చి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రైతుబంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని రాష్ట్ర మహిళలు గమనిస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నువ్వు చేసిన మోసాన్ని నిరుద్యోగులు యువత గమనిస్తున్నారు. మీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. ఏదో ఒక కమిషన్ ఎంక్వయిరీ అంటూ కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ బిజెపి దొంగనాటకాలు దొంగ బాగోతం అంతా తెలంగాణ ప్రజలకు అంతా అర్థమయింది . ఒక కేసు కాదు ఇంకా వెయ్యి కేసులు పెట్టిన మేం ప్రశ్నిస్తూనే ఉంటాం'' అని కేటీఆర్ అన్నారు.