హైదరాబాద్‌లో బీజేపీకి వ్యతిరేకంగా.. 'నయవంచన' పేరుతో వెలసిన ఫ్లెక్సీలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముందు హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీ వెలిసింది.

By అంజి  Published on  25 April 2024 7:09 AM GMT
BJP, Hyderabad, Amit Shah, Telangana

హైదరాబాద్‌లో బీజేపీకి వ్యతిరేకంగా.. 'నయవంచన' పేరుతో వెలసిన ఫ్లెక్సీలు

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముందు హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని హేళన చేస్తూ ప్రశ్నిస్తూ ఓ ఫ్లెక్సీ వెలిసింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై ఇది కనిపించింది.

పదేండ్ల మోసం- వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల పేరుతో ఫ్లెక్సీ వెలసింది. తెలంగాణకు బీజేపీ గత పదేండ్లలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, కృష్ణా జలాల్లో వాటా వంటి అంశాలతో బ్యానర్ పేర్కొన్నారు.

20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?, మా 15 లక్షలు ఎక్కడ, బార్డర్‌లో చైనా వైలెంట్‌.. మోడీ సైలెంట్, తెలంగాణ ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వని మోడీ ప్రభుత్వం, పదేండ్లలో లక్ష రైతుల ఆత్మహత్యలు, పదేండ్లలో మూడింతలైన అప్పు అంటూ పలు అంశాలను బ్యానర్‌లో పేర్కొన్నారు. చివరకు పదేండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం అని స్లోగన్‌ కూడా ఇచ్చారు.

గతంలో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రభుత్వం కూడా అమిత్‌ షా, మోదీ తెలంగాణకు ప్రచారానికి వచ్చినప్పుడల్లా ఇలాంటి ట్రిక్స్‌ను ఉపయోగించింది.

ఈరోజు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో అమిత్ షా బహిరంగ సభలో ప్రసంగించనున్న సందర్భంగా హైదరాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద కొత్త ఫ్లెక్సీ వెలిసింది.

సిద్దిపేటలో.. కేంద్ర ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక & పర్యాటకం, అభివృద్ధి శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డితో పాటు పార్టీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి ఎం రఘునందన్ రావు తదితరులు పాల్గొంటారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ సంఖ్యాబలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా, తెలంగాణలో ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందనే ధీమాతో ఉంది.

ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్లు 121 - 152 మధ్య రోడ్‌షో నిర్వహించనున్నారు.

Next Story