కెల్విన్‌ వాంగ్మూలం చాల‌దు : ఎక్సైజ్‌ శాఖ

Excise Department On Drugs Case. సంచ‌ల‌నం సృష్టించిన‌ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ

By Medi Samrat  Published on  20 Sep 2021 3:00 PM GMT
కెల్విన్‌ వాంగ్మూలం చాల‌దు : ఎక్సైజ్‌ శాఖ

సంచ‌ల‌నం సృష్టించిన‌ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్‌పై తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌లో నిందితులు, సాక్షుల జాబితాలో నటుల పేర్లను చేర్చలేదు. కెల్విన్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో నటుల విచారణను ఎక్సైజ్‌ శాఖ ప్రస్తావించింది. డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీల పాత్రపై బలమైన, తగిన ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. నటులు, హోటల్స్‌, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు డగ్స్‌ అమ్మినట్లు డ్రగ్స్‌ సరఫరాదారు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉందని తెలిపింది.

సిట్‌ బృందం పలువురికి నోటీసులు ఇచ్చి వారిని ప్రశ్నించిందని.. అన్ని సాక్ష్యాలను పరిశీలించి, విశ్లేషించిందని పేర్కొంది. కెల్విన్ మాటలను బలమైన ఆధారాలుగా పరిగణించలేమని తెలిపింది. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్‌ వాంగ్మూలం చాలదని స్పష్టం చేసింది. సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్‌ లభించలేదని వివరించింది. పూరి జగన్నాథ్‌, తరుణ్‌ స్వచ్ఛందంగా శాంపుల్స్‌ ఇచ్చారని.. వారి శాంపుల్స్‌ డ్రగ్స్ ఆనవాళ్లు లేవన్నది ఎఫ్ఎస్ఎల్ నివేదికతో స్పష్టమైందని వెల్లడించింది.


Next Story