ఈటల రాజేందర్ బీజేపీలో చేరేది ఆనాడే..!
Etela Join BJP Soon. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి ముహుర్తం ఖరారయ్యింది. జూన్ 14న ఆయన
By Medi Samrat Published on 10 Jun 2021 2:09 PM GMT
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి ముహుర్తం ఖరారయ్యింది. జూన్ 14న ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారనే క్లారిటీ వచ్చేసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీలో చేరనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇటీవలే గుడ్బై చెప్పిన తర్వాత ఈటల తన సన్నిహితులతో చర్చించి బీజేపీలోకి చేరితేనే బెటర్ అని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈటల రాజీనామా నేపథ్యంలో హుజురాబాద్లో ఉప ఎన్నిక జరగనుంది.
బీజేపీలో చేరిన వెంటనే ఈటల ఢిల్లీ నుండి నేరుగా హుజురాబాద్ వెళ్తారని తెలుస్తోంది. హుజురాబాద్ లో ఈటల పాదయాత్ర చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ ను ఈటల ఒంటరిగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే టీఆర్ఎస్ లో తనకు జరిగిన అన్యాయాన్ని, కేసీఆర్ చేసిన ఇబ్బందులను ప్రజలకు ఈటల పాదయాత్ర ద్వారా చెప్పే అవకాశం ఉంది.
రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమ తదితరులు కూడా బీజేపీలో చేరనున్నారు.