ఫోన్ ట్యాపింగ్లో ఆ నేతల ప్రమేయం కూడా ఉంది.. సీబీఐకి అప్పగించండి: ఈటల
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు..అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
By Knakam Karthik
ఫోన్ ట్యాపింగ్లో ఆ నేతల ప్రమేయం కూడా ఉంది.. సీబీఐకి అప్పగించండి: ఈటల
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు..అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులపై ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. 2021 హుజురాబాద్ ఉప ఎన్నికలో నా ఫోన్ ట్యాప్ చేశారు. నన్ను ఓడగొట్టాలని ప్రయత్నాలు చేశారు. నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా నా ఫోన్ ట్యాప్ చేశారు. బీఆర్ఎస్తో లాలూచీ పడకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ను డిమాండ్ చేస్తున్నా..అని ఈటల పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలి..అని ఈటల డిమాండ్ చేశారు. రిటైర్ అయ్యాక కూడా ప్రభాకర్ రావుకు పదవి కట్టబెట్టారు. ప్రభాకర్రావును అక్రమంగా ఎస్ఐబీలో నియమించారు. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధా కిషన్ రావు, తిరుపతన్నల ప్రమేయంతో పాటు నేతల ప్రమేయం కూడా ఉంది. రాష్ట్రానికి గవర్నర్గా పని చేసిన ఇంద్రాసేనా రెడ్డి ఫోన్ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సినిమా రంగానికి చెందిన వాళ్లు, జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. రాజ్యాంగం హక్కులు కాపాడాలంటే ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలి. చట్టం ప్రకారం వారికి శిక్ష పడాలి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్తో కుమ్మక్కు అయినట్లే భావించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు సక్రమంగా జరిపించాలి. లేదంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలి..అని బీజేపీ ఎంపీ ఈటల మాట్లాడారు.