కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి : మంత్రి పొన్నం

కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ సుమోటగా తీసుకొని కేసు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

By -  Medi Samrat
Published on : 1 Nov 2025 3:39 PM IST

కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి : మంత్రి పొన్నం

కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ సుమోటగా తీసుకొని కేసు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు 5 వేలు అడుక్కోండి అని చెప్తున్న మాట అక్షేపణీయం అన్నారు. ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తున్నాం.. ఓటుకు 5 వేల చొప్పున ప్రస్తావన తెచ్చిన అంశాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేటీఆర్‌పై కేసు పెట్టాలన్నారు.

చరిత్రలో అందరికీ తెలుసు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు ఆరు వేలు ఇచ్చిన సంస్కృతి మీది.. ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తూ.. మరింత అభివృద్ధి చేస్తామని విశ్వాసం కలిగిస్తూ ఓట్లు అడుగుతున్నామ‌న్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన కలిగినవారు.. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాదిరి కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపిస్తారు.. మేము 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కు గ్యాస్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, నూతనంగా ఉద్యోగాలు ఇచ్చామ‌ని.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తూ డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, రోడ్లు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించామ‌న్నారు.

మా అభ్యర్థి చదువుకున్న వ్యక్తి.. పనిచేయగలిగే శక్తి ఉన్న నవీన్ యాదవ్ ను ఆశీర్వదిస్తున్నారు.. ప్రజా పాలన ప్రభుత్వం.. ప్రజలకు న్యాయం చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తుంద‌న్నారు. ఉప ఎన్నికల్లో ఓటుకు 5 వేలు తీసుకోండి అని చెప్తున్న ఆ పార్టీ దుస్థితి చూసి జాలి పడాలి.. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి బీజేపీ, బీఆర్ఎస్‌లు కుమ్మకైద‌న్నారు. బీజేపీ మూడంకెలు దాటని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టిందన్నారు. మీరు బీజేపీకి వేసినా బీఆర్ఎస్‌కు ఓటు వెళ్తుంది.. బీఆర్ఎస్‌కు వేసినా బీజేపీకి పోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధిని కాంక్షించండ‌ని పిలుపునిచ్చారు.

Next Story