పార్టీ మారలేదని స్పీకర్కు 8 మంది ఎమ్మెల్యేల వివరణ..బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశాం..పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారు.
By - Knakam Karthik |
హైదరాబాద్: నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశాం..పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం మరింత గడువు కావాలని స్పీకర్ను కోరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల సమాధానాలను ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పంపించారు.
బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీచేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్రెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. కానీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలివ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ను కోరినట్లు సమాచారం.
అయితే తమపై చేసిన ఆరోపణలపై 8 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో పలు లీగల్ జడ్జిమెంట్లను కూడా ఉదహరించినట్లు తెలిసింది. ప్రధానంగా తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని, ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్లు సమాచారం. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కప్పుకున్నామని పైగా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని అని 8 మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
పార్టీ ఫిరాయింపు నోటీసులపై ఎమ్మెల్యేలిచ్చిన వివరణలను బీఆర్ఎస్ లీగల్ సెల్ పరిశీలనకు పంపింది. వారిపై ఫిర్యాదు చేసినప్పుడు తాము సమర్పించిన ఫొటోలు, వీడియోలు, పత్రికా కథనాలు ఇప్పుడు వివరణలో పేర్కొన్న అంశాలపై న్యాయ నిపుణులు విశ్లేషణ జరుపుతున్నారు. స్పీకర్ నిర్దేశించిన గడువులోగా ఈ 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై సమగ్ర సమాధానాలను వేర్వేరుగా సభాపతికి సమర్పించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. స్పీకర్ నుంచి లేఖలు అందడంతో 13వ తేదీలోగా తమ అభ్యంతరాలను పంపేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది.