తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని, తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను కేంద్రంగా చేయాలనేది తమ ప్రభుత్వం సంకల్పమని, అందుకు బ్లూప్రింట్ సిద్ధం చేశామని తెలిపారు.
చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ఛైర్మన్ దిల్ రాజు ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుతుంటారని తెలిపారు. సినీ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా సలహాలు, సూచనలు ఇస్తుంటారని, అందుకు ఆయనను అభినందిస్తున్నానన్నారు. సినిమా రంగం ద్వారా సామాజిక సందేశాలు ఇవ్వడంతో పాటు వాణిజ్య పరంగా లబ్ధి పొందవచ్చని అన్నారు. చిత్ర పరిశ్రమ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని తెలిపారు.